manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 2:20 pm Editor : manabharath

వడదెబ్బతో జీపీ వర్కర్ మృతి..

మన భారత్, ఆదిలాబాద్: 

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని వడ్గావ్ గ్రామపంచాయతీకి చెందిన జీపి వర్కర్ మాణిక్ రావు (42) హఠాన్మరణం చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. సర్పంచ్ మేస్రం సురేష్ ,పంచాయతీ కార్యదర్శి శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం, మాణిక్ రావు శనివారం ఉదయం విధులు నిర్వహిస్తున్న సమయంలో తీవ్ర ఎండల కారణంగా వడదెబ్బకు గురై అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.

సహచరులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ సాయంతో ఆయనను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం మాణిక్ రావు మృతి చెందినట్లు తెలిపారు.

మాణిక్ రావు మరణవార్త గ్రామంలో విషాదాన్ని నింపగా, కుటుంబ సభ్యులు, సహచరులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కూలీ పనులతో జీవనం సాగిస్తున్న ఆయన కుటుంబం ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నుండి తక్షణ సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మృతుడికి భార్య‌‌‌ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

ఇటీవలి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో, బహిరంగంగా పనిచేసే కార్మికులు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..