మన భారత్, ధన్వాడ:
పింఛన్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధన్వాడలో చేయూత పింఛన్ లబ్ధిదారులు రాస్తారోకో నిర్వహించారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో కొంతసేపు రాకపోకలు స్తంభించాయి.
ఇటీవల పింఛన్ డబ్బులు ఇవ్వడంలో ఆలస్యం జరుగుతుండటంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో డబ్బులు అందిస్తామని పోస్ట్ అధికారులు హామీ ఇచ్చిన నేపథ్యంలో గురువారం ఉదయం నుంచే లబ్ధిదారులు పోస్ట్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. గంటల తరబడి నిరీక్షించినప్పటికీ డబ్బులు అందకపోవడంతో వారి ఓపిక నశించింది.
“మేము కుంటోళ్లం, గుడ్డోళ్లం, ముసలోళ్లం… ఎన్ని సార్లు మీ చుట్టూ తిరగాలి? పింఛన్ డబ్బులు ఇస్తారా లేదా?” అంటూ లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పోస్ట్ ఆఫీస్ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.
లబ్ధిదారుల ఆందోళనతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించారు. రాస్తారోకోను విరమింపజేసిన అనంతరం లబ్ధిదారులు పోస్ట్ ఆఫీస్ వద్ద అధికారులతో వాగ్వివాదానికి దిగారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా పింఛన్ పంపిణీ ఆలస్యమవుతోందని తెలిపారు. త్వరలోనే డబ్బులు అందజేస్తామని హామీ ఇచ్చారు. పోలీసులు కూడా లబ్ధిదారులను ఓపిక పట్టాలని కోరడంతో చివరకు ఆందోళన విరమించారు.
పింఛన్పై ఆధారపడే వృద్ధులు, వికలాంగులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
