మన భారత్, వనపర్తి :
పదో తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన ఆనందం క్షణాల్లో విషాదంగా మారిన ఘటన వనపర్తి జిల్లా ఖిల్లా గణపూర్ మండలం సోళీపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. 441 మార్కులు సాధించిన విద్యార్థి భరత్ (15) వడదెబ్బకు గురై మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
వివరాల ప్రకారం, ఫలితాలు వచ్చిన అనంతరం ఆనందంలో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న భరత్, ఆట మధ్యలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి వడదెబ్బ కారణంగా మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఈ ఘటనతో భరత్ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. గ్రామస్థులు కూడా ఈ విషాద ఘటనపై తీవ్రంగా కలత చెందుతున్నారు. చదువులో ప్రతిభ కనబరిచిన బాలుడి ఆకస్మిక మరణం అందరినీ షాక్కు గురిచేసింది.
ఈ సందర్భంగా వైద్యులు హెచ్చరిస్తూ, ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో బయట ఎక్కువసేపు ఉండకూడదని, తగినంత నీరు తాగడం, తలపై కవర్ ధరించడం, శరీరాన్ని చల్లగా ఉంచే చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఎండలో ఆటలు, పనులు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు.
ఈ విషాద ఘటనతో జిల్లాలో ఎండల తీవ్రతపై మళ్లీ చర్చ మొదలైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
