manabharath.com
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 12:57 am Editor : manabharath

రుణమాఫీ రైతు భరోసా ఇవ్వాలని రైతు ఆమరణ దీక్ష..!

మన భారత్, తలమడుగు (ఆదిలాబాద్):

రెండు లక్షల రూపాయల రుణమాఫీ, రైతు భరోసా సకాలంలో చెల్లింపు, పంట బీమా అమలు వంటి డిమాండ్లతో తలమడుగు మండలానికి చెందిన రైతు కె. కిషోర్ రావు ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు ఆమరణ దీక్ష చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ ఆయన ఈ నిరసనకు దిగారు.

ఈ సందర్భంగా కిషోర్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుబంధు కూడా సకాలంలో అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

రైతులు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసి, రైతుబంధు కోసం ఎదురుచూస్తున్నారని, కానీ సమయానికి ఆర్థిక సహాయం అందకపోవడంతో ఆర్థిక భారం పెరుగుతోందని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాల్సిన అవసరం ఉందని, ప్రతి పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా పంట బీమా (పసల్ బీమా) పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, రైతుల భద్రతకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో తన ఆమరణ దీక్షను కొనసాగిస్తానని కిషోర్ రావు హెచ్చరించారు.

ఈ నిరసన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు, ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..