manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 12:50 pm Editor : manabharath

మానవత్వం చాటిన ట్రాఫిక్ పోలీసులు..

మన భారత్, మహబూబాబాద్:

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది మానవత్వాన్ని చాటుతూ ఓ రైతుకు సహాయం చేసిన ఘటన ప్రశంసలు అందుకుంటోంది. జిల్లా కేంద్రంలోని అండర్ బ్రిడ్జి వద్ద ఓ రైతు తీసుకెళ్తున్న ధాన్యం బస్తా ప్రమాదవశాత్తూ జారి రోడ్డుపై చెల్లాచెదురైన సంఘటన చోటుచేసుకుంది.

ఈ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ భాస్కర్, పాపాలల్, హోమ్ గార్డ్ వెంకన్న పరిస్థితిని గమనించి వెంటనే స్పందించారు. రోడ్డుపై పడిపోయిన ధాన్యాన్ని వృథా కాకుండా జాగ్రత్తగా సేకరించి మళ్లీ బస్తాలలో నింపి రైతుకు అందజేశారు.

అదేవిధంగా ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా వాహనాలను నియంత్రిస్తూ, రోడ్డును శుభ్రపరచి రాకపోకలు సజావుగా సాగేందుకు చర్యలు తీసుకున్నారు. పోలీసుల సమయస్ఫూర్తి, సేవాభావం స్థానికుల ప్రశంసలను అందుకుంది.

ఈ సందర్భంగా రైతు భూక్యా బాలాజీ ట్రాఫిక్ పోలీసుల సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు జరిగిన నష్టాన్ని తగ్గించడంలో పోలీసులు కీలక పాత్ర పోషించారని అన్నారు.

ఈ ఘటనతో పోలీసులు కేవలం చట్టాన్ని అమలు చేసే వారే కాకుండా, ప్రజల సమస్యల్లో భాగస్వాములు కూడా అని మరోసారి నిరూపితమైంది. ప్రజలు కూడా రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ, సరుకు రవాణా సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..