manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 12:06 pm Editor : manabharath

బాలికల భద్రతపై అవగాహన అవసరం..

మన భారత్, మొగుళ్ళపల్లి:

బాలబాలికల భద్రతపై సమగ్ర అవగాహన కల్పించడం ప్రస్తుత సమాజంలో అత్యంత అవసరమని మొగుళ్ళపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని మేదరమెట్ల గ్రామంలో అంగన్వాడీ సూపర్వైజర్ రజిత ఆధ్వర్యంలో నిర్వహించిన చైల్డ్ సేఫ్టీ వీక్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ముప్పు సురేష్ మాట్లాడుతూ, చిన్న వయసు నుంచే పిల్లలకు భద్రతకు సంబంధించిన చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. మహిళలు, బాలికలు తమ రక్షణ కోసం అందుబాటులో ఉన్న చట్టాలను తెలుసుకోవడం, అత్యవసర పరిస్థితుల్లో ధైర్యంగా వ్యవహరించడం ఎంతో ముఖ్యం అన్నారు.

భద్రతకు సంబంధించిన మొబైల్ యాప్‌లు, హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన కలిగి ఉండాలని, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆన్లైన్ వేధింపుల నుండి ఎలా రక్షణ పొందాలో తెలుసుకోవడం కూడా అవసరమని చెప్పారు. బాలికలకు మార్షల్ ఆర్ట్స్ వంటి స్వీయరక్షణ పద్ధతులను నేర్పించాలని తల్లిదండ్రులను ప్రోత్సహించారు.

అదేవిధంగా, పాఠశాలల్లో ఉపాధ్యాయులు “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్”పై స్పష్టమైన అవగాహన కల్పించాలని, కౌమార దశలో జరిగే శారీరక మార్పులపై శాస్త్రీయంగా వివరించాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలతో ప్రేమతో మెలగడం ద్వారా వారు ఎదుర్కొనే సమస్యలను సులభంగా పంచుకునే వాతావరణం కల్పించాలన్నారు. తల్లిదండ్రులు–పిల్లల మధ్య కమ్యూనికేషన్ లోపం లేకుండా చూడడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.

పోస్టర్లు, కరపత్రాల ద్వారా చట్టాలు, హెల్ప్‌లైన్ వివరాలు అందించడం ద్వారా పిల్లల్లో అవగాహన పెంపొందించవచ్చని తెలిపారు. చదువుతో పాటు సమాజంలో ఉన్న ప్రమాదాలు, పిల్లల హక్కులపై అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. చైల్డ్ సేఫ్టీ వీక్ కార్యక్రమం పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించే వేదికగా మారాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మేదరమెట్ల గ్రామ సర్పంచ్ వైనాల ధనలక్ష్మి, ఏఎన్ఎం షబీదా, మహిళా సమాఖ్య సభ్యురాలు పావని, చైల్డ్ హెల్ప్‌లైన్ కేస్ వర్కర్ కళావతి, పంచాయతీ కార్యదర్శి శారద, జిపిఓ రజిత, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, కిశోర బాలికలు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..