మన భారత్, మొగుళ్ళపల్లి:
బీసీ కులగణన అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే తీవ్ర ఆందోళనలు చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం మొగుళ్ళపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జాతీయ జనగణనలో దేశ ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని Narendra Modi పిలుపునిచ్చిన నేపథ్యంలో, బీసీ కులగణనపై మాత్రం స్పష్టత ఇవ్వకపోవడం అనుమానాస్పదమని ఆయన విమర్శించారు. బీసీలను నమ్మించి మోసం చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందని ఆరోపించారు.
గత ఏడాది ఏప్రిల్ 30న ఢిల్లీలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో సమగ్ర కులగణన చేపడతామని ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం కొనసాగుతున్న జనగణనలో బీసీలను లెక్కించకుండా ఉండటం అన్యాయమని మహేందర్ గౌడ్ పేర్కొన్నారు. కేంద్రం రూపొందించిన 33 ప్రశ్నల ప్రశ్నావళిలో 34వ ప్రశ్నగా బీసీ కుటుంబాలను ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు.
బీసీల కులగణన లేకుండా నిర్వహించే జనగణన ద్వారా ఈ వర్గానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కోట్లాది బీసీల హక్కులు, అవకాశాలు కులగణనపై ఆధారపడి ఉన్నాయని, ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేయడం సరైంది కాదని అన్నారు.
అలాగే, బీసీ కులగణనపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోతే మే 10న తెలంగాణకు రానున్న ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
ఇక మహిళా బిల్లుపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. మహిళల హక్కుల పేరుతో బిల్లు తీసుకువస్తున్న బీజేపీ, బీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. దేశంలోని కోట్లాది బీసీ మహిళల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోకుండా తీసుకునే నిర్ణయాలను అంగీకరించబోమని స్పష్టం చేశారు.
బీసీలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
