మన భారత్, తలమడుగు:
మండల కేంద్రంలో ఫ్రీ బస్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. పరిమితికి మించి ప్రయాణికులు బస్సుల్లో ఎక్కి నిలబడి ప్రయాణించడం సాధారణమైపోయిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్, కండక్టర్లు ఎంతగా హెచ్చరించినా వినకుండా అధిక సంఖ్యలో ఎక్కడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ బస్సు కోసాయి నుంచి ఆదిలాబాద్ వరకు ప్రయాణిస్తూ తలమడుగు, రూయ్యాడి తదితర గ్రామాల్లో ఆగుతూ వెళ్తుంది. ముఖ్యంగా ఉద్యోగాలకు వెళ్లేవారు, కాలేజీ విద్యార్థులు, ఇతర పనుల నిమిత్తం ఆదిలాబాద్కు వెళ్లేవారు ఈ బస్సుపైనే ఆధారపడుతున్నారు. అయితే సీట్ల పరిమితి తక్కువగా ఉండటంతో చాలా మంది నిలబడే పరిస్థితి ఏర్పడుతోంది.
మార్గమధ్యంలో బస్సు ఆగకపోయినా ప్రయాణికులు ఎక్కే ప్రయత్నం చేయడం, ఆపై డ్రైవర్లను నిందించడం వంటి ఘటనలు జరుగుతున్నాయని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులు సహకరించి నియమాలను పాటించాలని అధికారులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇక తలమడుగు మండలానికి ఒకే బస్సు రావడం వల్లే ఈ సమస్య తీవ్రతరమైందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అదనంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించాలని అధికారులను కోరుతున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
