మన భారత్, ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రాంతంలో గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అటవీ ఉత్పత్తుల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో ఈ కొనుగోళ్లు చేపట్టామని జీసీసీ డివిజనల్ మేనేజర్ సందీప్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అడవుల్లో గిరిజనులు సేకరించే వివిధ అటవీ ఉత్పత్తులకు సరైన ధర అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోందన్నారు. ఇప్ప పువ్వు, ఇప్ప పరక, తేనె, మైనం, చింతపండు వంటి ఉత్పత్తులను గిరిజనులు జీసీసీ సొసైటీ కార్యాలయాలు లేదా డీఆర్ డిపోల వద్దకు తీసుకువచ్చి విక్రయించాలని సూచించారు.
మధ్యవర్తుల ద్వారా తక్కువ ధరలకు విక్రయించి నష్టపోకుండా, ప్రభుత్వ ఆధ్వర్యంలో న్యాయమైన ధరలు పొందాలని గిరిజనులకు విజ్ఞప్తి చేశారు. జీసీసీ ద్వారా కొనుగోలు చేయడం వల్ల గిరిజనులకు పారదర్శక వ్యవస్థలో చెల్లింపులు జరుగుతాయని తెలిపారు.
అటవీ ఉత్పత్తుల కొనుగోలు ద్వారా గిరిజనుల ఆదాయాన్ని పెంచడం, వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంతో గిరిజనులకు నేరుగా లాభం చేకూరడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
గిరిజనులు పెద్ద సంఖ్యలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ప్రభుత్వ మద్దతుతో తమ ఉత్పత్తులకు సరైన విలువ పొందాలని అధికారులు కోరారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
