manabharath.com
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 4:16 pm Editor : manabharath

వడ దెబ్బతో కూలీ మృతి ..

మన భారత్ , ఆదిలాబాద్: 

జిల్లాలోని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్న వేళ వడ దెబ్బ కారణంగా మరో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం, భీంపూర్ మండలంలోని అర్లి టి గ్రామానికి చెందిన టేకం గజనన్ (38) అనే వ్యవసాయ కూలీ తీవ్ర వడ దెబ్బకు గురయ్యాడు. బుధవారం పని సమయంలోనే అస్వస్థతకు లోనైన ఆయనను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అత్యవసరంగా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

అయితే రెండు రోజులుగా చికిత్స పొందుతూ ఉన్న గజనన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉండటంతో గ్రామస్తులు, బంధువులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉపాధి కూలీలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. మధ్యాహ్న వేళల్లో పనులు తగ్గించుకోవడం, ఎక్కువగా నీరు తాగడం, తల కప్పుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఈ ఘటనతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వం ఇలాంటి బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..