manabharath.com
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 8:53 am Editor : manabharath

కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్

మన భారత్, నల్లగొండ:
నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్యపై దశాబ్దాలుగా పోరాటం సాగించిన సామాజిక కార్యకర్త దుశ్చర్ల సత్యనారాయణ పై జరిగిన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం దీర్ఘకాలంగా పోరాడుతున్న వ్యక్తిపై దాడి జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులను వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

అలాగే గాయపడిన దుశ్చర్ల సత్యనారాయణకు తక్షణం మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వం పర్యవేక్షించి అవసరమైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న దుశ్చర్ల సత్యనారాయణ వంటి కార్యకర్తలకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజా హక్కుల కోసం కృషి చేసే వారిపై దాడులు జరగకుండా కట్టడి చేయాలని కోరారు.

ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా స్పందనలు వ్యక్తమవుతుండగా, దోషులపై చర్యలు తీసుకోవాలని పలు వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..