మన భారత్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లాలో వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం (24-04-2026) జిల్లా కేంద్రంలో ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్ను దాటగా, పరిసర మండలాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ రూరల్ మండలం, బేల, జైనథ్, బోరజ్, సాత్నాల ప్రాంతాల్లో కూడా 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉండగా, సాయంత్రం 5 గంటల వరకు వేడి కొనసాగింది. అనంతరం ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు సుమారు 40 డిగ్రీలు, 6 నుంచి 7 గంటల మధ్య 38 డిగ్రీలు, 7 నుంచి 8 గంటల వరకు 36 డిగ్రీలు నమోదయ్యాయి. రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య 34 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
జిల్లాలోని తూర్పు ప్రాంతాలైన ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, ఇంద్రవెల్లి ప్రాంతాల్లో అలాగే పశ్చిమ భాగంలోని బోథ్, బజార్ హత్నూర్, సోనాల మండలాలు, దక్షిణ ఆదిలాబాద్ ప్రాంతాల్లోని ఇచ్చోడ, నేరడిగొండ, గుడిహత్నూర్ ప్రాంతాల్లో జిల్లా కేంద్రంతో పోలిస్తే 1 నుంచి 2 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
వాతావరణ శాఖ సూచనల మేరకు ప్రజలు ఎండ తీవ్రత నుంచి జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, తగినంత నీరు తాగాలని, తలకు రక్షణగా టోపీ లేదా గుడ్డ కట్టుకోవాలని సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
