manabharath.com
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 6:56 am Editor : manabharath

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి..

మన భారత్, నాగర్ కర్నూల్:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో, వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పొదిల రామయ్య డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో ఎదుట జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా పొదిల రామయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని, యూనియన్లను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయకుండా సమ్మె ప్రారంభమై మూడు రోజులు గడిచినా చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నదని విమర్శించారు.

ఇప్పటికే రెండున్నర సంవత్సరాలుగా వేతన సవరణ చేయకుండా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తోందని, ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఉద్యోగులను జిల్లాలకు పంపించి, తద్వారా వారి ఉద్యోగ భద్రతపై అనుమానాలు కలిగిస్తున్నదని ఆరోపించారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 53 రోజుల పాటు పోరాటం చేసిన ఆర్టీసీ కార్మికులు, ఇప్పుడు మళ్లీ తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు దిగాల్సి వచ్చిన పరిస్థితి దురదృష్టకరమని పేర్కొన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని హెచ్చరించారు. కార్మికుల హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు, యూనియన్ నాయకులు, వామపక్ష పార్టీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..