manabharath.com
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 4:34 am Editor : manabharath

ఫేస్ అథెంటికేషన్‌ రాక ఎండలో కష్టాలు..

మన భారత్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధి హామీ కూలీల పరిస్థితి దయనీయంగా మారుతోంది. మండుటెండల్లో కష్టపడి పనిచేస్తున్నప్పటికీ, వేతనాలు సకాలంలో అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల అమలులోకి వచ్చిన ఫేస్ అథెంటికేషన్ విధానం కూలీలకు కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. సాంకేతిక లోపాల కారణంగా హాజరు నమోదు చేయడానికి గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని కూలీలు చెబుతున్నారు. సిగ్నల్ సమస్యలు, యాప్ లోపాలు కారణంగా పని చేసినా హాజరు నమోదు కాకపోవడంతో వేతనాలు నిలిచిపోతున్నాయని ఆరోపిస్తున్నారు.

వేసవి తీవ్రత మధ్య ఉదయం నుంచే పనులకు హాజరవుతున్న కూలీలు, మధ్యాహ్నం వేడి తీవ్రతను తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాంకేతిక సమస్యలు మరింత భారంగా మారుతున్నాయని అంటున్నారు. ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు ముఖ్య ఆదారంగా ఉన్నప్పటికీ, ఈ సమస్యల వల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కూలీలు ప్రభుత్వాన్ని కోరుతూ, ఫేస్ అథెంటికేషన్ విధానంలో తలెత్తుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలను త్వరితగతిన విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేసి కూలీలకు ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు.

ఈ సమస్యలపై అధికారులు దృష్టి సారించి తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..