మన భారత్, మొగుళ్లపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో జరిగిన ఆటో ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరికొందరు గాయాల పాలయ్యారు.
సమాచారం ప్రకారం, సైదాపూర్ మండలం సోమారం గ్రామానికి చెందిన కోల సాన్విక-అనిల్ దంపతుల కుమార్తె సాత్విక కొరికిశాల గ్రామంలోని కస్తూర్బా గురుకుల పాఠశాలలో చదువుతోంది. వేసవి సెలవులు ప్రకటించడంతో గురువారం ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు సాన్విక తన బంధువు ఎదురుకొల్ల స్వప్నతో కలిసి సొంత ఆటోలో పాఠశాలకు వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో పర్లపల్లి, పెద్దకొమటిపల్లి గ్రామాల మధ్య ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కోల సాన్విక (24) అక్కడికక్కడే మృతి చెందగా, కోల అనిల్ తీవ్రంగా గాయపడ్డాడు. సాత్విక, ఎదురుకొల్ల స్వప్నలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఘటనను గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. స్పందించిన అంబులెన్స్ సిబ్బంది గాయపడిన వారిని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం హుజురాబాద్ సివిల్ ఆసుపత్రికి మార్చారు.
తక్షణ స్పందనతో సేవలు అందించిన 108 సిబ్బంది శీలపాక రాజు, సత్యంలను స్థానిక ప్రజలు, అధికారులు అభినందించారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
