manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 2:34 pm Editor : manabharath

బీసీల హక్కుల కోసం పోరాటం..

మన భారత్, మొగుళ్ళపల్లి:

బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ తీవ్రంగా ఆరోపించారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు.

దేశవ్యాప్తంగా కులగణన పూర్తికాకముందే డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను ఆయన ఖండించారు. కులగణన అనంతరం జనాభా దామాషా ప్రకారం బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీసీల రాజకీయ హక్కులను పరిరక్షించాలంటే ముందుగా కులగణన నిర్వహించి, ఆ తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని డిమాండ్ చేశారు.

మహిళా బిల్లు పేరుతో బీసీ మహిళలకు న్యాయం జరగకుండా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించిన మహేందర్ గౌడ్, చట్టసభల్లో కూడా బీసీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. స్థానిక సంస్థల తరహాలోనే అసెంబ్లీ, పార్లమెంట్‌లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సముచిత అవకాశాలు ఉండాలని స్పష్టం చేశారు.

గత 11 సంవత్సరాల బీజేపీ పాలనలో బీసీల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించిన ఆయన, ఇప్పుడు హామీలు ఇస్తున్నా ప్రజలు నమ్మరని అన్నారు. బీసీ వర్గాలపై జరుగుతున్న అన్యాయాన్ని వెలుగులోకి తీసుకువచ్చేందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో గ్రామ గ్రామాన ప్రచారం చేపడతామని వెల్లడించారు.

బీసీ సమాజం మొత్తం కలిసి తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చిన ఆయన, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా డీలిమిటేషన్ చేయడం వల్ల ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..