manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 1:44 pm Editor : manabharath

విద్యుత్ షాక్‌తో అసిస్టెంట్ లైన్ మెన్ మృతి

మన భారత్, భీంపూర్:
భీంపూర్ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ మరమ్మతుల పనులు నిర్వహిస్తున్న సమయంలో అసిస్టెంట్ లైన్ మెన్ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. ఈ ఘటన గురువారం భీంసరి సమీపంలోని ఓ పంట పొలంలో జరిగింది.

రూరల్ సీఐ ఫణిదర్ తెలిపిన వివరాల ప్రకారం, తాంసికి చెందిన అనిల్ పాటిల్ అనే అసిస్టెంట్ లైన్ మెన్ 33 కేవీ విద్యుత్ స్తంభంపై ఎక్కి మరమ్మతులు చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ ప్రవాహం కొనసాగడంతో తీవ్ర షాక్‌కు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందగా, ఆయనతో పాటు పనిచేస్తున్న మరో ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి.

గాయపడిన ఉద్యోగిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్ శాఖలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది.

గ్రామంలో ఈ ఘటనతో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. స్థానికులు, సహోద్యోగులు అనిల్ పాటిల్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు.


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..