manabharath.com
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 3:45 pm Editor : manabharath

గ్రీన్ ఫీల్డ్ హైవేకు భూసేకరణపై రైతుల ఆందోళన

మన భారత్, మొగుళ్ళపల్లి:

నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం చేపడుతున్న భూసేకరణలో అన్యాయం జరుగుతోందని మొగుళ్ళపల్లి మండల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులను అక్రమంగా అరెస్టు చేసి, పోలీసుల సహాయంతో బలవంతంగా భూముల్లోకి ప్రవేశించి భూసేకరణ చేపడుతున్నారని వారు ఆరోపించారు.

మండల కేంద్రంలో ఉన్న భూములకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించకుండా తక్కువ ధర నిర్ణయించడం అన్యాయమని రైతులు పేర్కొన్నారు. సమీపంలోని నవాబుపేట గ్రామంలో ఎకరాకు రూ.27.50 లక్షలు చెల్లిస్తుండగా, మొగుళ్ళపల్లి మండల కేంద్రానికి కేవలం రూ.22.50 లక్షలు నిర్ణయించడం వివక్షతగా ఉందని వారు విమర్శించారు.

అలాగే రంగాపురం గ్రామానికి నోటిఫికేషన్ అనంతరం రిజిస్ట్రేషన్ విలువలను పరిగణనలోకి తీసుకుని రూ.29.60 లక్షలు నిర్ణయించగా, మండల కేంద్రానికి తక్కువ ధర కేటాయించడం సరైంది కాదని రైతులు ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాంతానికి కూడా అదే విధంగా న్యాయమైన, ప్రస్తుత మార్కెట్ ధర ఆధారంగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ సమస్యపై ఇప్పటికే పలు మార్లు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినప్పటికీ అధికారుల నుంచి సరైన స్పందన రాలేదని రైతులు తెలిపారు. తమ తాతముత్తాతల నుండి వస్తున్న భూములు జీవనాధారమని, వాటిని కోల్పోవడం తమ కుటుంబాలకు తీవ్రమైన నష్టం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే జిల్లా కలెక్టర్, ప్రభుత్వం స్పందించి సముచిత పరిహారం అందించి న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మరింత తీవ్ర ఆందోళనలకు సిద్ధమని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మోరే రవీందర్ రెడ్డి, బండారి రవీందర్, అరికాంతపు కృష్ణారెడ్డి, కొల్లూరు మనోహర్, స్వప్న, అడ్డూరి రాజేందర్, గుండా బిక్షపతి, గుర్రపు సునంద రెడ్డి, ముడుపు మల్లారెడ్డి, మోరే పద్మ, మోరే అనూష, చిలకామారి బొంద్యాలు, గుర్రపు తిరుపతి రెడ్డి, కుమార్ తదితర రైతులు పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..