మన భారత్, మొగుళ్ళపల్లి:
భూపాలపల్లి జిల్లాలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయంలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, విద్యార్థులకు అన్ని అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు. బుధవారం నిర్వహించిన వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమం కింద విద్యాశాఖ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గురుకుల విద్యాలయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో చర్చించిన కలెక్టర్, అభివృద్ధి పనులను ఆలస్యం చేయకుండా తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచాలని, విద్యా వాతావరణాన్ని మరింత అనుకూలంగా మార్చాలని సూచించారు.
ప్రత్యేకంగా వసతి, తాగునీరు, పారిశుద్ధ్యం, భోజన వసతులు, తరగతి గదుల పరిస్థితి వంటి అంశాలపై దృష్టి సారించి, సమగ్రంగా అభివృద్ధి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా గురుకులాల అభివృద్ధి అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖాధికారి రాజేందర్, సర్పంచ్ చాట్ల విజయ రవీందర్, తహసీల్దార్ సునీత, ఎంపీడీవో సురేందర్, ఎంజె పి ప్రిన్సిపాల్ శ్యామలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి కట్టుబడి ఉందని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
