manabharath.com
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 5:03 pm Editor : manabharath

అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.!

మన భారత్, తెలంగాణ: 
తెలంగాణలో ప్రజా రవాణాపై భారీ ప్రభావం చూపేలా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో ఆర్టీసీ జేఏసీ నాయకుల మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో, ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమవుతుందని కార్మిక సంఘాలు ప్రకటించాయి.

సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానుండగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చి 41 రోజులు గడిచినా, ప్రభుత్వం ఆలస్యంగా చర్చలకు పిలవడం పట్ల జేఏసీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

కార్మికుల ప్రధాన డిమాండ్లలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, సంఘాల ఎన్నికలు నిర్వహించడం, బస్సులను ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడపడం వంటి అంశాలు ఉన్నాయని తెలిపారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం సరైన స్పందన ఇవ్వలేదని ఆరోపించారు.

చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేసిందని, తమ సమస్యలను పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదని జేఏసీ నాయకులు విమర్శించారు. “ఎవరి ఒత్తిళ్లకు మేము తలొగ్గం.. మా హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు.

సమ్మె కారణంగా ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వం త్వరితగతిన పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..