manabharath.com
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 9:56 am Editor : manabharath

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ సూపర్వైజర్ రజిత పేర్కొన్నారు. సోమవారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరేపల్లి, మొగుళ్లపల్లిలోని 4, 5 అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన “గ్రాడ్యుయేషన్ డే” కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నపిల్లల మెదడు అభివృద్ధిలో తొలి ఐదు సంవత్సరాలు అత్యంత కీలకమని వివరించారు. ఈ సమయంలో పిల్లలకు సరైన విద్య, సంస్కారం అందితే వారి భవిష్యత్తు బలపడుతుందని తెలిపారు. పుట్టినప్పటి నుంచి ఐదేళ్ల వయస్సు వరకు పిల్లల మెదడు 90 శాతం వరకు అభివృద్ధి చెందుతుందని, ఈ దశలో నేర్పిన విషయాలు వారికి జీవితాంతం ఉపయోగపడతాయని చెప్పారు.

అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లల వయస్సుకు అనుగుణంగా అభివృద్ధి మైలురాళ్లను అంచనా వేసి, అసెస్మెంట్ కార్డుల ద్వారా వారి పురోగతిని నమోదు చేస్తున్నట్లు తెలిపారు. పిల్లలకు ఆటపాటల ద్వారా విద్య బోధిస్తూ, ఇంటి వాతావరణం కల్పిస్తూ వారి శారీరక, మానసిక అభివృద్ధికి అంగన్వాడీ టీచర్లు కృషి చేస్తున్నారని చెప్పారు.

రెండున్నర సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. దీని ద్వారా పిల్లల అభివృద్ధిని సమగ్రంగా అంచనా వేసి, వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయడం సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు బత్తిని స్వప్న, వెల్దండి వెన్నెల, మోటే రజిత, ఆయాలు, తల్లిదండ్రులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..