manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 3:21 pm Editor : manabharath

సీఎం పర్యటన.. ఇసుక రవాణా నిషేధం

మన భారత్, మొగుళ్లపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల భాగంగా ఇసుక రవాణాను తాత్కాలికంగా నిషేధించినట్లు మొగుళ్లపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ తెలిపారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

జిల్లాలో సీఎం పర్యటన సజావుగా సాగేందుకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇసుక రవాణాపై తాత్కాలిక ఆంక్షలు విధించినట్లు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు నిబంధనలను కచ్చితంగా పాటించాలని హెచ్చరించారు. ఆంక్షలను ఉల్లంఘించి ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని స్పష్టం చేశారు. భద్రతా చర్యలలో భాగంగా పోలీసు శాఖ ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తుందని తెలిపారు.

ప్రజలు, వాహనదారులు పోలీసు శాఖకు సహకరించి పర్యటన విజయవంతం కావడానికి తోడ్పడాలని ఎస్ఐ విజ్ఞప్తి చేశారు. అధికారులు తీసుకున్న ఈ చర్యలతో జిల్లాలో భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టంగా అమలవుతున్నాయి.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..