manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 12:48 pm Editor : manabharath

బీసీలకు 42% రిజర్వేషన్లకు పోరాటం..

మన భారత్, మొగులపల్లి:
బీసీ సమాజానికి 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావాలని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ కోరారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డీలిమిటేషన్ అంశంపై ఇండియా కూటమి ఏకమై పార్లమెంట్‌లో పోరాడిన విధంగా, బీసీల హక్కుల సాధనకూ అదే స్థాయిలో కృషి చేయాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల తీర్మానాన్ని కేంద్రానికి పంపించిన నేపథ్యంలో, ఆ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చురుకైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణనలో బీసీ కులగణనను కూడా చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

2026 జనాభా లెక్కలు పూర్తికాకముందే మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను అడ్డుకోవడం సానుకూల పరిణామమని అభిప్రాయపడ్డారు. ఇదే ఉత్సాహంతో సామాజిక రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేసే దిశగా పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.

దేశవ్యాప్తంగా బీసీ కులగణన నిర్వహించడం, తెలంగాణలో ఆమోదించిన 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంట్ మద్దతు పొందడం కోసం అన్ని వర్గాల బీసీ ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ అంశంలో బీసీ సమాజం కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..