మన భారత్, తెలంగాణ:
కామారెడ్డి జిల్లాలో అవినీతి అధికారిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. బిచ్కుంద ఎక్సైజ్ కార్యాలయంలో సీఐగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణను రూ.2 లక్షలు లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
వివరాల ప్రకారం, ఒక గ్రామంలో ఉన్న కల్లు దుకాణాన్ని మరో గ్రామానికి మార్చేందుకు అనుమతులు ఇవ్వాలంటే లంచం ఇవ్వాలని సీఐ సత్యనారాయణ బాధితునిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, పక్కా ప్రణాళికతో సీఐ ఇంటిపై దాడి నిర్వహించి పట్టుకున్నారు.
దాడి సమయంలో సీఐ వద్ద అదనంగా రూ.45,670 నగదు కూడా లభించగా, దానిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీఐపై కేసు నమోదు చేసి న్యాయస్థానానికి హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ఈ ఘటనతో జిల్లాలో అవినీతి వ్యవహారాలపై మరోసారి చర్చ ప్రారంభమైంది. ప్రజలు ఇలాంటి అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
