manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 2:40 am Editor : manabharath

తేజస్వి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన..

మన భారత్, ఆదిలాబాద్ టౌన్:

పార్లమెంట్ సమావేశంలో బీజేపీ ఎంపీ Tejasvi Surya తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్‌తో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ నాయకత్వంలో ఎన్టీఆర్ కూడలి వద్ద జరిగిన ఈ నిరసనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం తేజస్వి సూర్య దిష్టిబొమ్మకు నిప్పంటించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా డా. నరేష్ జాదవ్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించదగిన విషయమని అన్నారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి పరంగా పెద్దగా చేసిందేమీ లేదని విమర్శించారు.

అదేవిధంగా తెలంగాణకు కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందని, డిలిమిటేషన్ అంశంలో కూడా రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిత్ ఖాన్, మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ సుజాత, రాష్ట్ర కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు జాదవ్ వసంత్ రావు తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.