మన భారత్, తలమడుగు:
బోథ్ నియోజకవర్గంలోని రైతులకు ఉపశమనం కలిగించేలా జొన్న మరియు మక్కల కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మార్క్ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ను కోరారు. ఈ మేరకు హైదరాబాద్లోని కార్యాలయంలో ముధోల్ ఎమ్మెల్యేతో కలిసి మర్యాదపూర్వకంగా కలసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, రైతులు పండించిన పంటలకు సరైన ధర లభించాలంటే ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం అవసరమని తెలిపారు. ముఖ్యంగా బోథ్ నియోజకవర్గంలోని ధన్నూర్, బోథ్, నెరడిగొండ, ఇచ్చొడ, తాంసి, భీంపూర్, బజార్ హత్నూర్ మండలాల్లో రైతులు జొన్న, మక్క పంటలను పెద్ద ఎత్తున పండిస్తున్నారని, వారికి మార్కెట్ సౌకర్యాలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
రైతుల సమస్యలను గుర్తించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయగా, మార్క్ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. సోమవారం నుంచే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతాయని ఎమ్మెల్యే వెల్లడించారు.
ఈ నిర్ణయంతో రైతులకు సరైన ధర లభించడమే కాకుండా మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
