manabharath.com
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 2:57 pm Editor : manabharath

వడదెబ్బకు జాగ్రత్తలు తప్పనిసరి.!

తలమడుగు, మన భారత్:

ఆదిలాబాద్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో తలమడుగు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డా. హరీష్ సూచించారు. “మన భారత్”కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వేసవికాలంలో పాటించాల్సిన జాగ్రత్తలు, వడదెబ్బ లక్షణాలు, నివారణ చర్యలను వివరించారు.

ప్రస్తుతం జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో రైతులు, కూలీలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపే పనులు పూర్తి చేసుకుని రావాలని సూచించారు. అధిక వేడి కారణంగా డీహైడ్రేషన్ సమస్యలు పెరుగుతున్నాయని, అందువల్ల ఎక్కువగా నీరు తీసుకోవాలని చెప్పారు.

వడదెబ్బ లక్షణాలు: శరీర ఉష్ణోగ్రత 41°C (105°F)కి చేరుకోవడం, నీరసం, మాట తడబడటం, చర్మం పొడిబారడం, తీవ్రమైన తలనొప్పి, అధిక దాహం, మూత్రం పసుపు రంగులో రావడం, మూత్ర విసర్జన సమయంలో మంట, ఎండలో సొమ్మసిల్లి పడిపోవడం వంటి లక్షణాలు వడదెబ్బకు సూచికలని తెలిపారు.

కారణాలు: ఎండలో ఎక్కువగా తిరగడం, తగినంత నీరు తాగకపోవడం, శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవడం, మాంసాహారం మరియు మత్తు పదార్థాల వినియోగం వలన వడదెబ్బకు గురయ్యే అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.

నివారణ చర్యలు: ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకుండా నీడలో ఉండడం, కాటన్ దుస్తులు ధరించడం, నలుపు రంగు దుస్తులను దూరంగా ఉంచడం, ప్రయాణ సమయంలో వేడిగాలి నుండి రక్షణ తీసుకోవడం వంటి చర్యలు పాటించాలని సూచించారు.

చికిత్స విధానం: వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడలోకి తీసుకెళ్లి శరీరాన్ని చల్లబరచాలని, తడి గుడ్డతో తుడవాలని చెప్పారు. ఒక లీటర్ నీటిలో ఓఆర్ఎస్ కలిపి తాగించాలి. రోగి బీపీ, పల్స్ వంటి అంశాలను గమనిస్తూ, అపస్మారక స్థితి ఉంటే వెంటనే సమీప ఆసుపత్రికి తరలించాలని సూచించారు.

ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎండలో పనులు చేయకుండా ఉదయం లేదా సాయంత్రం సమయంలో మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు. ప్రజలు ఈ సూచనలు పాటిస్తే వడదెబ్బ ప్రమాదాన్ని నివారించవచ్చని వైద్యులు తెలిపారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..