నారాయణపేట, మన భారత్:
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీస్ శాఖ చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం భాగంగా నారాయణపేట జిల్లా జాజాపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి నారాయణపేట రూరల్ ఎస్సై సతీష్ రెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యలే ప్రమాదాలకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి మాట్లాడుతూ, ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం సమాజంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రతి విద్యార్థి తమ కుటుంబ సభ్యులకు హెల్మెట్, సీట్ బెల్ట్ వంటి భద్రతా చర్యల ప్రాముఖ్యతను తెలియజేయాలని సూచించారు.
అదేవిధంగా ప్రమాదాల సమయంలో సహాయం చేసే వారికి పోలీసులు గౌరవం అందిస్తున్నారని, ప్రజల సహకారం రోడ్డు భద్రతలో ఎంతో ముఖ్యమని తెలిపారు. ఎండలు, వర్షాలు, విపత్తులు వంటి పరిస్థితుల్లో కూడా పోలీసులు ప్రజల కోసం నిరంతరం సేవలందిస్తున్నారని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించడంతో పాటు బాధ్యతాయుత పౌరులుగా తయారు చేయడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం చివర్లో విద్యార్థుల చేత రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది హెచ్ భాను ప్రకాష్, నిర్మల, మధుసూదన్, నర్సింలు, మంగళ, హెడ్ కానిస్టేబుల్ ఆనంద్, మల్లికార్జున్ గౌడ్, పోలీస్ కానిస్టేబుల్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
