manabharath.com
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 1:37 pm Editor : manabharath

దళిత సమస్యలపై ఎమ్మార్పీఎస్ స్వరం.!

మన భారత్, తలమడుగు (ఆదిలాబాద్)

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేష్ మాదిగ అధ్యక్షత వహించగా, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో మల్లేష్ మాదిగ మాట్లాడుతూ, అంటరానితనం, కులవివక్షల వంటి సామాజిక దుష్ప్రవర్తనలను ఎదిరించి అంబేద్కర్ చేసిన పోరాటం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. ఆయన జయంతిని ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని తెలిపారు.

రిజర్వేషన్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అవకాశాలు కల్పించినప్పటికీ, ఆ వర్గాల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించడంలో కొంతమంది ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారని విమర్శించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు విశ్వవిద్యాలయం లేకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే జిల్లా కేంద్రంలో మహనీయుల పేరుతో కేటాయించిన స్థలాలను కొందరు ఆక్రమించుకోవడం దారుణమని పేర్కొన్నారు. జిల్లాలోని 21 మండలాల్లో మాల, మాదిగ, సంచార జాతుల ప్రజలు ఇప్పటికీ ఇళ్ల సౌకర్యం, కమ్యూనిటీ హాళ్లు, రోడ్లు, ఉపాధి వంటి ప్రాథమిక సదుపాయాల కొరతతో బాధపడుతున్నారని తెలిపారు.

దళిత వర్గాల సమస్యలపై ప్రతి నెల సమీక్ష సమావేశాలు నిర్వహించాలని, సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పూలే-అంబేద్కర్ ఆశయాలతో కుల నిర్మూలన కోసం పోరాటం కొనసాగుతుందని గుర్తుచేశారు.

అలాగే తమ ఉద్యమానికి అడ్డంకులు ఎదురైనప్పుడు భద్రత కల్పించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..