మన భారత్, నారాయణపేట:
పిడిఎస్యూ స్థాపకులు, యువ మేధావి కామ్రేడ్ జార్జి రెడ్డి ఆశయ సాధన కోసం యువత, విద్యార్థులు ఐక్యంగా పోరాడాలని పిడిఎస్యు మాజీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్. సాయికుమార్ పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్లోని భగత్ సింగ్ భవన్లో జార్జిరెడ్డి 54వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని జార్జిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ, జార్జిరెడ్డి భారతదేశంలో ప్రగతిశీల ఉద్యమాలకు మార్గదర్శకుడిగా నిలిచారని పేర్కొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి హక్కుల కోసం, సమానత్వ సమాజ స్థాపన కోసం ఆయన చేసిన పోరాటాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని అన్నారు. నేటి విద్యాసంస్థల్లో కనిపిస్తున్న ప్రజాస్వామిక వాతావరణానికి ఆయన త్యాగాలు, పోరాటాలే కారణమని తెలిపారు.
గొప్ప విద్యార్థి నాయకుడిగానే కాకుండా, న్యూక్లియర్ ఫిజిక్స్లో గోల్డ్ మెడలిస్ట్గా, కిక్బాక్సింగ్లో ఛాంపియన్గా జార్జిరెడ్డి ప్రతిభను చాటుకుని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఖ్యాతి తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఆయనను భౌతికంగా తొలగిస్తే ఉద్యమం ఆగిపోతుందని భావించిన శక్తుల కుట్రలు విఫలమై, ఆయన మరణం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసిందని తెలిపారు.
జార్జిరెడ్డి ప్రారంభించిన ప్రగతిశీల ఉద్యమం నేడు లక్షలాది మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోందని, కులమత అసమానతలు, మూఢనమ్మకాలపై పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల బలోపేతం, విద్యా రంగ పరిరక్షణ, విద్యార్థి హక్కుల సాధన కోసం యువత ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పిడిఎస్యూ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్, జిల్లా సహాయ కార్యదర్శి రాజు, నాయకులు సురేష్, నందిని, నవనీత, లక్ష్మి, నితిన్, విశాల్, అనిత, చరణ్ తేజ, పావని, కార్తీక్, నర్సింహా, శృతి, శివాని తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ నాయకులకు శుభవార్త..!
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
