మన భారత్, బోథ్:
ఆదిలాబాద్ జిల్లా బోథ్ అటవీ శాఖ కార్యాలయంలో అవినీతి వ్యవహారం బహిర్గతమైంది. లంచం తీసుకుంటూ ఎఫ్ఆర్ఓ ప్రణయ్, జూనియర్ అసిస్టెంట్ పరశురాం ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కారు. ఈ విషయాన్ని ఏసీబీ డీఎస్పీ మధు వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే, ఉపాధి హామీ పథకం కింద మొక్కలకు నీరు పోసే పనులు చేసిన ఓ వ్యక్తికి రూ.5.9 లక్షల బిల్లు మంజూరు అయింది. అయితే ఆ బిల్లును విడుదల చేయాలంటే ఎఫ్ఆర్ఓ, జూనియర్ అసిస్టెంట్ కలిసి రూ.40 వేల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి సూచనల మేరకు రూ.15 వేల రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. గురువారం నాడు కార్యాలయంలో డబ్బులు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఇద్దరినీ పట్టుకున్నారు.
ఈ ఘటనతో అటవీ శాఖలో అవినీతి వ్యవహారాలపై మళ్లీ చర్చ మొదలైంది. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇలాంటి అవినీతి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు హెచ్చరించారు.
ప్రజలు ప్రభుత్వ సేవలను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా అవినీతిని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
🔖రాజకీయ నాయకులకు శుభవార్త..! మరిన్ని వివరాలకు క్రింది ఉన్న రెడ్ లింక్ క్లిక్ చేయండి
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
