ధన్వాడ, మన భారత్:
ధన్వాడ మండలం చర్లపల్లి గ్రామపంచాయతీకి చెందిన చెత్త సేకరణ ట్రాక్టర్ను కాంట్రాక్ట్ పనులకు వినియోగించడం వివాదాస్పదంగా మారింది. స్థానికంగా జరుగుతున్న మురుగు కాలువ నిర్మాణ పనుల కోసం అవసరమైన సిమెంట్ సంచులను తీసుకురావడానికి పంచాయతీ ట్రాక్టర్ను ఉపయోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వార్డ్ సభ్యుడు మొగులయ్య తెలిపిన వివరాల ప్రకారం, కొండాపూర్ గ్రామం నుంచి చర్లపల్లి వరకు సిమెంట్ సంచులను చెత్త ట్రాక్టర్లో తరలించడం గమనించి, వెంటనే వాహనాన్ని ఆపి పంచాయతీ సిబ్బందిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సిబ్బంది, సర్పంచ్ మరియు గ్రామ కార్యదర్శి ఆదేశాల మేరకు ట్రాక్టర్ను ఉపయోగించినట్లు సమాధానం ఇచ్చినట్లు తెలిపారు.

పంచాయతీకి చెందిన వాహనాలను ప్రజా అవసరాల కోసం మాత్రమే వినియోగించాల్సి ఉండగా, కాంట్రాక్ట్ పనులకు వినియోగించడం సరైనదా అని మొగులయ్య ప్రశ్నించారు. ప్రభుత్వ వనరులను ప్రైవేట్ పనులకు ఉపయోగించడం నియమాలకు విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై మండల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించిన వార్డ్ సభ్యుడు, సంబంధిత అధికారుల నుంచి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కూడా కోరుతున్నారు.
రాజకీయ నాయకులకు శుభవార్త..!
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
