manabharath.com
Newspaper Banner
Date of Publish : 04 April 2026, 4:48 pm Editor : manabharath

ఫూలే దంపతుల విగ్రహాల ఏర్పాటు..

మన భారత్, తెలంగాణ : 

తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయానికి ప్రతీకలైన మహాత్మ జ్యోతిబాపూలే  సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాల ఏర్పాటు నిర్ణయంపై అఖిల భారతీయ మాలీ మహా సంఘం హర్షం వ్యక్తం చేసింది. ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఫూలే స్మృతి వనం ఏర్పాటు చేసి, ఏప్రిల్ 11న మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ జరగనున్న నేపథ్యంలో సంఘం నేతలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న షిండే, మాలి ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ అంబేకర్, ప్రధాన కార్యదర్శి ప్రధాన్ భాస్కర్, కార్యవర్గ సభ్యులు వాడగురే శ్రీనివాస్ మాట్లాడుతూ, ఫూలే దంపతుల ఆలోచనలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. గతంలో హైదరాబాదులోని ప్రగతి భవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి వినతి పత్రం అందజేసిన నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని అన్నారు.

సామాజిక ఉద్యమ పితామహుడు మహాత్మ జ్యోతిబాపూలే, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే సమానత్వం, విద్యా విస్తరణ కోసం చేసిన కృషి చిరస్మరణీయమని గుర్తుచేశారు. ఫూలే దంపతుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలు బడుగు, బలహీన వర్గాలకు మరింత ప్రేరణనిస్తాయని అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా, ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 33 జిల్లాలకు రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయించి ఫూలే జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. అదిలాబాద్ జిల్లా కలెక్టర్ అదనంగా రూ.1 లక్ష విడుదల చేయడంతో జిల్లాలో కూడా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

ఈ సందర్భంగా సమాజంలోని అన్ని వర్గాలు ఫూలే దంపతుల చూపిన మార్గంలో నడుస్తూ సమసమాజ నిర్మాణం, సామాజిక న్యాయం సాధనకు కృషి చేయాలని సంఘం నేతలు పిలుపునిచ్చారు.


రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..