మన భారత్, మియాపూర్:
హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫేస్బుక్ పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్న యువతి, పెళ్లైన కేవలం 50 రోజుల్లోనే ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం, బిహార్కు చెందిన ఇషిక యాదవ్ (26) సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. ఐదేళ్ల క్రితం ఫేస్బుక్ ద్వారా మధ్యప్రదేశ్కు చెందిన నీరజ్ బన్సాల్తో పరిచయం ఏర్పడి, అది క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ కుటుంబ సభ్యులను ఒప్పించి ఈ ఏడాది ఫిబ్రవరి 10న పట్నాలో వివాహం చేసుకున్నారు. అనంతరం హైదరాబాద్ మియాపూర్లోని ఒక అపార్టుమెంట్లో నివాసం ఉంటున్నారు.
అయితే వివాహం అనంతరం భర్త నీరజ్ బన్సాల్ అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బంగారం, వజ్రాభరణాలు, మరిన్ని నగదు కోసం ఒత్తిడి పెంచడంతో ఇషిక తీవ్ర మనస్తాపానికి లోనైనట్లు సమాచారం.
ఈ క్రమంలో బుధవారం ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమెను మృతిగా నిర్ధారించారు.
మృతురాలి తల్లిదండ్రులు కట్న వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు భర్తపై దర్యాప్తు ప్రారంభించి, ఘటనకు గల పూర్తి కారణాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ఘటనతో నగరంలో మరోసారి కట్న వేధింపులపై చర్చ మొదలైంది. మహిళల భద్రత, చట్టాల అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
