మన భారత్ , తలమడుగు (ఆదిలాబాద్):
ఆదిలాబాద్ జిల్లాలో అక్రమంగా దేశీ దారు రవాణా చేసి విక్రయిస్తున్న వ్యక్తిని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఇచ్చిన సమాచారం మేరకు భీంసారి గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేండ్ల విజేందర్ వెల్లడించిన వివరాల ప్రకారం, మహారాష్ట్ర రాష్ట్రం నుండి అక్రమంగా దేశీ దారు తీసుకువచ్చి గ్రామంలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్న సిర్పూర్ జనార్ధన్ (తండ్రి అడెల్లు) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి సుమారు రూ.2,160 విలువ గల 90 ఎంఎల్ పరిమాణంలోని 54 దేశీ దారు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ విజేందర్ మాట్లాడుతూ, ఎవరైనా అక్రమంగా మద్యం రవాణా చేయడం లేదా విక్రయించడం చేస్తే కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపుతామని హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.

ఎక్సైజ్ శాఖ కట్టుదిట్టమైన చర్యలతో జిల్లాలో అక్రమ మద్యం వ్యాపారంపై నిఘా మరింత పెంచినట్లు సమాచారం.
