manabharath.com
Newspaper Banner
Date of Publish : 31 March 2026, 4:42 am Editor : manabharath

ఇచ్చోడలో ఐపీఎల్ బెట్టింగ్ బండారం బట్టబయలు

మన భారత్ , తలమడుగు (బోథ్):

జిల్లాలోని ఇచ్చోడ మండలం బృందావన కాలనీలో అక్రమంగా ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని పదిమందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజు వెల్లడించారు.

పోలీసుల సమాచారం మేరకు, విజయ్ అనే వ్యక్తి ప్రధాన పాత్రలో ఉండగా, మరికొంతమంది కలిసి చిట్టీల రూపంలో ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా దాడులు నిర్వహించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి మూడు బైకులు, 9 మొబైల్ ఫోన్లు, రూ. 4,470 నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా సీఐ రాజు మాట్లాడుతూ, జిల్లాలో ఎక్కడైనా అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలు కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.

పోలీసుల ఈ చర్యతో ప్రాంతంలో అక్రమ బెట్టింగ్‌పై కట్టడి మరింత కఠినంగా మారనుంది.