manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 9:17 am Editor : manabharath

ఆ టీచర్ ను శిక్షించాలి: పీవోడబ్యు లక్ష్మి

మన భారత్ | నారాయణపేట:

నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం మోమినాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని పట్ల ఉపాధ్యాయులు అసభ్యకరంగా, అవమానకరంగా ప్రవర్తించిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ POW (ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ విమెన్) జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి స్పందించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పదో తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు స్వామిని వెంటనే సస్పెండ్ చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, అదే పాఠశాలలో చదువుతున్న మరో మైనర్ విద్యార్థికి సంబంధిత వీడియోను పంపిన ఉపాధ్యాయుడు గురునాథ్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

పాఠశాలలో కంప్యూటర్ గదిలో విద్యార్థులకు, సిబ్బందికి తెలియకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారని ఆరోపించారు. అంతేకాకుండా, బాధిత విద్యార్థిని ముఖాన్ని బ్లర్ చేయకుండా వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేయడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.

ఈ ఘటన విద్యా వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని, ముఖ్యంగా బాలికల భద్రతపై ఆందోళనలు పెంచుతోందని ఆమె అన్నారు. పుట్టినప్పటి నుంచి వివక్షను ఎదుర్కొంటున్న బాలికలు చదువుల వైపు అడుగులు వేస్తున్న సమయంలో ఇలాంటి ఘటనలు తల్లిదండ్రులలో భయాందోళనలు కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

సమాజంలో దళితులు, మహిళలపై జరుగుతున్న దాడులు ఇంకా కొనసాగుతున్నాయని, ఇటీవల చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు ఇందుకు ఉదాహరణలని తెలిపారు. విద్యావంతులు చట్టబద్ధంగా ప్రవర్తించాల్సిన సమయంలో ఇలాంటి దురాగతాలకు పాల్పడటం విచారకరమని పేర్కొన్నారు.

నిందిత ఉపాధ్యాయులను శాశ్వతంగా విధుల నుంచి తొలగించడంతో పాటు, తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని POW నాయకులు హెచ్చరించారు. బాధిత విద్యార్థికి న్యాయం జరిగేలా ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.