manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 7:30 pm Editor : manabharath

అంతర్రాష్ట్ర రహదారిపై భయంకర మూల మలుపులు

మన భారత్ , తలమడుగు:

ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండల కేంద్ర పరిధిలో ఉన్న సుంకిడి అంతర్రాష్ట్ర రహదారిపై ప్రమాదకరమైన మూలమలుపు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ముఖ్యంగా ఉండం గ్రామ సమీపంలో ఉన్న ఈ మూలమలుపు కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ రహదారి ద్వారా తెలంగాణ–మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య రోజూ వందలాది మంది ప్రయాణం సాగిస్తారు. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రకు, మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌కు ప్రయాణించే ప్రజలకు ఈ మార్గం కీలకంగా ఉంది. అయితే, ఉండం గ్రామం వద్ద ఉన్న ప్రమాదకర మలుపు వాహనదారులకు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

స్థానికుల వివరాల ప్రకారం, గతంలో ఈ ప్రాంతంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ముఖ్యంగా భారీ వాహనాలు,  లారీలు రోజూ పెద్ద సంఖ్యలో ఈ మార్గంలో ప్రయాణిస్తుండటంతో ప్రమాదాల ముప్పు మరింత పెరిగింది.

ఇక వాహనదారులు ఎటు నుంచి ఏ వాహనం వస్తుందో తెలియక భయాందోళనలకు గురవుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఉండం, సుంకిడి గ్రామాల ప్రజలు కొన్ని కీలక డిమాండ్లు చేశారు. రహదారి పక్కన ఉన్న భారీ వృక్షాలను తొలగించడం, రోడ్డును విస్తరించడం, అలాగే ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ చర్యలు తీసుకుంటే వాహనాలు నెమ్మదిగా ప్రయాణించే అవకాశం ఉండి ప్రమాదాలను నివారించవచ్చని వారు పేర్కొన్నారు.

సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని కోరుతున్నారు.