మన భారత్, నారాయణపేట:
మద్దూర్ మండలంలోని మోమినాపూర్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సి. స్వామిని వెంటనే విధుల నుండి తొలగించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను వాట్సాప్లో విద్యార్థినిలకు పంపి వైరల్ చేసిన మరో ఉపాధ్యాయుడు గుర్నాథ్ రెడ్డిపై కూడా కఠిన చర్యలు తీసుకుని విధుల నుండి తొలగించాలని కోరారు.

ఈ మేరకు గురువారం నారాయణపేట జిల్లా కలెక్టరేట్లో ఏఓ శ్రీధర్కు ప్రజాసంఘాల ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, సిఐటియు జిల్లా కార్యదర్శి బాల్ రామ్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సమ్రిన్ మాట్లాడుతూ, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు ఇలాంటి అసభ్యకర ప్రవర్తనకు పాల్పడటం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అభం శుభం తెలియని బాలికతో వెకిలి చేష్టలు చేస్తూ ఆమె భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిన ఉపాధ్యాయుడు సి. స్వామిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, అతడిని పూర్తిగా సేవల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సీసీ కెమెరా రికార్డింగులను అనైతికంగా వాట్సాప్ ద్వారా ఇతర విద్యార్థినిలకు పంపి పరువు తీసిన గుర్నాథ్ రెడ్డిపై కూడా తీవ్ర చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ ఇద్దరు ఉపాధ్యాయులపై సమగ్ర విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి కే. కాశప్ప, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుండెగారి దస్తప్ప, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు శివకుమార్, భీమ్ రాజ్, మహిళా సంఘం నాయకురాలు వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

