మన భారత్, నారాయణపేట :
విద్యాసంస్థలలో విద్యార్థుల భద్రత, నాణ్యమైన విద్య కోసం విద్యాశాఖ అధికారుల కట్టుదిట్టమైన పరవేక్షణ తప్పనిసరి అని పిడిఎస్యూ (PDSU) జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ పేర్కొన్నారు. మద్దూర్ మండలంలోని మోమినాపూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకున్న అసభ్య ప్రవర్తన ఘటనపై పిడిఎస్యూ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) గోవిందరాజులకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థిపై అసభ్యంగా ప్రవర్తించడం విద్యా వ్యవస్థకు, ఉపాధ్యాయ వృత్తికి మచ్చతెచ్చే ఘటన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు మరెక్కడా పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మోమినాపూర్ జెడ్పీ హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడు స్వామి 10వ తరగతి విద్యార్థిపై అసభ్య ప్రవర్తనకు పాల్పడిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, అతనిని తక్షణమే సస్పెండ్ చేయడమే కాకుండా భవిష్యత్తులో ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ విద్యాసంస్థలోనూ ఉద్యోగావకాశం లేకుండా కఠిన శిక్షలు విధించాలని విద్యాశాఖను కోరారు.
విద్యాసంస్థలపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈఓలు), జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)లు తమ పనితీరును మెరుగుపర్చాలని సూచించారు. అవసరమైతే జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి కూడా పర్యవేక్షణ ఉండాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల భద్రత, గౌరవం కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని, దీనిపై నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని పిడిఎస్యూ నేతలు కోరారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఈఓ గోవిందరాజులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పిడిఎస్యూ జిల్లా సహాయ కార్యదర్శి రాజు, జిల్లా నాయకులు సురేష్, నవనీత, లక్ష్మి, నితిన్, రాకేష్, పావని, వైష్ణవి, నవదీప్ తదితరులు పాల్గొన్నారు.
