manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 4:18 am Editor : manabharath

పంటలకు తీవ్ర నష్టం.. రైతుల ఆందోళన

కామారెడ్డి, మన భారత్:

కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలో మంగళవారం కురిసిన వడగళ్ల వాన రైతులకు పెద్ద దెబ్బతీసింది. ముఖ్యంగా పెద్దమల్లారెడ్డి, కంచర్ల గ్రామాల్లో ఆకస్మికంగా కురిసిన వడగళ్ల వర్షం కారణంగా వరి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్టపోయాయి.

చేతికి అందిన పంటలు ఒక్కసారిగా నేలమట్టం కావడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పొట్ట దశలో ఉన్న వరి గింజలు వడగళ్ల ప్రభావంతో పగిలిపోవడంతో పంట నాణ్యత పూర్తిగా దెబ్బతింది. దీంతో దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక మొక్కజొన్న పంటలు కూడా వడగళ్ల వానను తట్టుకోలేక పూర్తిగా నేలకొరిగాయి. పంటలు కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో వచ్చిన ఈ ప్రకృతి విపత్తు రైతుల ఆశలను ఒక్కసారిగా చిదిమేసింది. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి, అప్పులు తీసుకుని సాగు చేసిన రైతులు ఇప్పుడు నష్టాల బారిన పడటంతో ఆర్థికంగా కుదేలవుతున్నారు.

ఈ నేపథ్యంలో బాధిత రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అధికారులు వెంటనే గ్రామాలకు చేరుకుని నష్టం అంచనా వేసి, అర్హులైన రైతులకు తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. పంట బీమా ఉన్న రైతులకు త్వరితగతిన క్లెయిమ్‌లు పరిష్కరించాలని కూడా కోరుతున్నారు.

ప్రకృతి వైపరీత్యాలతో వరుసగా నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.