మన భారత్, న్యూఢిల్లీ:
దేశవ్యాప్తంగా లోక్సభ, రాష్ట్ర శాసనసభ స్థానాల పునర్విభజన (Delimitation) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియకు 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

పునర్విభజనలో భాగంగా ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల సంఖ్యను సుమారు 50 శాతం వరకు పెంచే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేసే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే దేశ రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగే అవకాశముంది.

ఈ పునర్విభజనతో లోక్సభ స్థానాల సంఖ్య 816కు చేరే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రాల వారీగా కూడా స్థానాల సంఖ్య పెరుగుతుందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ స్థానాలు 262-263 వరకు, లోక్సభ స్థానాలు 37-38 వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 178-179 వరకు, లోక్సభ స్థానాలు 25-26 వరకు పెరగవచ్చని సమాచారం.

ఈ మార్పులు అమల్లోకి వస్తే రాజకీయ సమీకరణాల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. పార్టీల వ్యూహాలు, ఎన్నికల సమీకరణాలు పూర్తిగా మారే పరిస్థితి నెలకొనవచ్చు. ముఖ్యంగా కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో స్థానిక నాయకత్వానికి కొత్త అవకాశాలు లభించనున్నాయి.

అయితే పునర్విభజన ప్రక్రియపై వివిధ రాష్ట్రాల అభిప్రాయాలు, రాజకీయ పార్టీల స్పందనలు కీలకంగా మారనున్నాయి. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దీనిపై విస్తృత చర్చ జరిగే అవకాశముంది.
