మన భారత్, న్యూఢిల్లీ:
దేశంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు కీలక మార్పులపై ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వినియోగంలో ఉన్న 14.2 కిలోల గ్యాస్ సిలిండర్లకు బదులుగా, 10 కిలోల గ్యాస్తో కూడిన సిలిండర్లను అందించే ప్రతిపాదన పరిశీలనలో ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.

వివరాల ప్రకారం, గ్యాస్ కొరతను దృష్టిలో ఉంచుకుని రీఫిల్లింగ్ పరిమాణాన్ని తగ్గించి, వినియోగదారులకు తక్కువ ధరకు సిలిండర్లు అందించే విధానాన్ని పరిశీలిస్తున్నారు. 14.2 కిలోల సిలిండర్ సాధారణంగా చిన్న కుటుంబాలకు 35 నుంచి 40 రోజుల వరకు సరిపోతుండగా, 10 కిలోల సిలిండర్ సుమారు నెల రోజుల పాటు ఉపయోగించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఈ మార్పుతో సరఫరాలో సమతుల్యత సాధించడంతో పాటు, గ్యాస్ కొరతను తగ్గించవచ్చని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. అంతేకాకుండా, తక్కువ పరిమాణం సిలిండర్ల వల్ల నిల్వలను పెంచుకునే అవకాశం కూడా ఉంటుందని ఓ అధికారి పేర్కొన్నట్లు సమాచారం.

అయితే, ఈ ప్రతిపాదనపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. వినియోగదారుల అవసరాలు, మార్కెట్ పరిస్థితులు, ధరల ప్రభావం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఈ మార్పు అమల్లోకి వస్తే గృహ వినియోగదారులపై ప్రభావం ఎలా ఉంటుందన్నదానిపై ఆసక్తి నెలకొంది. తక్కువ పరిమాణం సిలిండర్లు వినియోగదారులకు ఎంతవరకు అనుకూలమవుతాయన్నది అమలు తర్వాతే స్పష్టమవుతుంది.
