manabharath.com
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 7:49 am Editor : manabharath

కొత్త ఫైర్ స్టేషన్‌కు గ్రీన్ సిగ్నల్.!

మన భారత్ ,ఆదిలాబాద్: బోథ్ మండల కేంద్రంలో కొత్త ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం స్థానిక ప్రజల్లో ఆనందాన్ని కలిగించింది. ఈ విషయాన్ని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ వెల్లడించారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం కీలకమని ఆయన పేర్కొన్నారు.

ఫైర్ స్టేషన్ మంజూరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ చారి కీలక పాత్ర పోషించినట్లు గజేందర్ తెలిపారు. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అనేకసార్లు ధర్నాలు, వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఫైర్ స్టేషన్ మంజూరు కాలేదని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించి వెంటనే స్పందించిందని పేర్కొన్నారు.

ఈ ఫైర్ స్టేషన్ కోసం మొత్తం 18 మంది సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో స్టేషన్ ఫైర్ ఆఫీసర్, లీడింగ్ ఫైర్‌మన్, డ్రైవర్ ఆపరేటర్, ఫైర్‌మన్, జూనియర్ అసిస్టెంట్, స్వీపర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ యూనిట్ నిర్వహణ కోసం సంవత్సరానికి సుమారు రూ.110.46 లక్షల వ్యయం అంచనా వేయగా, ప్రారంభ ఏర్పాట్ల కోసం రూ.303.35 లక్షల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

ఈ ఫైర్ స్టేషన్ ఏర్పాటు వల్ల బోథ్ మరియు పరిసర ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల సమయంలో తక్షణ సేవలు అందించేందుకు వీలు కలుగుతుందని, ప్రజల ప్రాణాలు మరియు ఆస్తులను కాపాడడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.