మన భారత్, తెలంగాణ:
రాష్ట్రంలో కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందిన రైతులు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పొందేందుకు ఈనెల 25వ తేదీలోపు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు. అర్హులైన రైతులు ఆలస్యం చేయకుండా తమ వివరాలను సమర్పించాలని అధికారులు స్పష్టం చేశారు.

అలాగే రైతు భరోసా నిధుల జమకు సంబంధించిన వివరాలలో మార్పులు చేయాలనుకునే రైతులు ఈనెల 21వ తేదీ వరకు సవరణలు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. బ్యాంకు ఖాతా, ఆధార్ లింకింగ్, ఇతర సమాచారం సరైనదిగా నమోదు చేయడం ద్వారా నిధులు సమయానికి జమ అవుతాయని సూచించారు.

దరఖాస్తు చేసుకునే రైతులు తమ ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ కాపీలను సమీప మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. అవసరమైన పత్రాలు పూర్తి స్థాయిలో అందించకపోతే దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నారు.

