మన భారత్, న్యూఢిల్లీ:
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా హార్ముజ్ జలసంధి వద్ద నిలిచిపోయిన నౌకల్లో రెండు భారతదేశానికి రానున్నాయని సమాచారం. LPG సరుకు మోస్తున్న పైన్ గ్యాస్ మరియు జగ్ వసంత్ అనే నౌకలు ప్రస్తుతం యూఏఈలోని షార్జా తీరానికి సమీపంలో నిలిచివున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే ఇవి నేటి నుంచే భారత జెండాతో ప్రయాణం ప్రారంభించే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

గత వారం ఇరాన్ అదుపులోకి తీసుకున్న రెండు LPG నౌకలను విడుదల చేయడంతో అవి సురక్షితంగా భారత్కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం షార్జా వద్ద ఉన్న నౌకలకు కూడా ఎలాంటి అడ్డంకులు ఉండకపోవచ్చని ఇండియన్ నౌకాయాన వర్గాలు అంచనా వేస్తున్నాయి.

దేశంలో LPG సరఫరాపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ, ఈ రెండు నౌకలు చేరుకుంటే గ్యాస్ కొరత కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా గృహ వినియోగం, పరిశ్రమల అవసరాలకు LPG సరఫరా స్థిరపడటంలో ఇది సహాయకారిగా మారనుంది.

హార్ముజ్ జలసంధి అంతర్జాతీయంగా కీలక వాణిజ్య మార్గంగా ఉండటంతో అక్కడి పరిస్థితులను భారత్ సన్నిహితంగా గమనిస్తోంది. భవిష్యత్లో సరఫరా అంతరాయం లేకుండా చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపైనా దృష్టి సారిస్తున్నట్లు సమాచారం.

