manabharath.com
Newspaper Banner
Date of Publish : 20 March 2026, 7:46 am Editor : manabharath

గుడ్ న్యూస్.. బడ్జెట్‌లో కొత్త పథకాలు..!

మన భారత్, హైదరాబాద్:

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో కొత్త పథకాలు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం12.00 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి.

ఆ వెంటనే అసెంబ్లీలో మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఈ 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

అలాగే శాసన మండలిలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి 2026 – 27 వార్షిక బడ్జెట్‌ను రూ.3,36,000 కోట్ల అంచనాతో రూపొందించినట్లు తెలుస్తోంది. గతేడాది 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.3,04,000 కోట్లతో బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

ఈ ఏడాది బడ్జెట్‌లో విద్య, వైద్యం, సంక్షేమం, నీటి పారుదలకు పెద్ద పీట వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెరిగిన రాష్ట్ర ఆదాయంతో.. బడ్జెట్ అంచనాలు 10 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. ఇక జీఎస్టీ శ్లాబులు మారినా కానీ.. రాష్ట్ర ఆదాయానికి పెద్దగా ఇబ్బంది కలగలేదని సమాచారం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, తమ్ముడిహట్టి బ్యారేజ్ నిర్మాణం, మూసీ రివర్ ఫ్రంట్, రీజినల్ రింగ్ రోడ్, మెట్రో రైల్, పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ఈ బడ్జెట్‌లో భారీగా నిధుల కేటాయింపులు చేసే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.