manabharath.com
Newspaper Banner
Date of Publish : 20 March 2026, 3:30 am Editor : manabharath

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు లేఖ..

మన భారత్, హైదరాబాద్: 

భాగ్యనగరంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ప్రాణహాని తలపెట్టేలా వచ్చిన బెదిరింపు లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే పలుమార్లు అంతర్జాతీయ నంబర్లు, సోషల్ మీడియా వేదికల ద్వారా బెదిరింపులు ఎదుర్కొన్న రాజాసింగ్‌కు, ఈసారి స్పష్టమైన తేదీతో లేఖ రావడం చర్చనీయాంశంగా మారింది.

అందిన సమాచారం ప్రకారం, ఈనెల 27వ తేదీలోగా రాజాసింగ్‌ను హతమార్చుతామని ఆ లేఖలో ఆగంతకులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన చేసిన కొన్ని ప్రసంగాల నేపథ్యంలోనే ఈ బెదిరింపులు వచ్చినట్టు భావిస్తున్నారు. ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ, ఇలాంటి హెచ్చరికలు రావడంతో ఆయన అనుచరుల్లో ఆందోళన నెలకొంది.

లేఖ అందిన వెంటనే రాజాసింగ్ కార్యాలయ ప్రతినిధులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, లేఖ మూలం ఏమిటి? దాన్ని ఎవరు పంపించారు?

అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. అదేవిధంగా, ఎమ్మెల్యే నివాసం, కార్యాలయం మరియు ఆయన సంచరించే ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచే చర్యలు తీసుకునే అవకాశముంది.

ఈ ఘటనతో నగరంలో భద్రతా వ్యవస్థపై మరింత అప్రమత్తత అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధుల భద్రత విషయంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పలు వర్గాలు కోరుతున్నాయి.