మన భారత్, తెలంగాణ:
హైదరాబాద్లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుక వైభవంగా కొనసాగుతున్నప్పటికీ, ఈవెంట్ నిర్వహణలో లోపాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా అతిథుల సమన్వయం, ఆతిథ్య ఏర్పాట్లలో తలెత్తిన సమస్యలు వేడుకపై నీడ వేసినట్లు తెలుస్తోంది.

ముంబైకి చెందిన ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు బాధ్యతలు అప్పగించినప్పటికీ, వారి నిర్వహణలో అనేక లోపాలు ఉన్నాయని అతిథులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెడ్కార్పెట్ వద్ద అతిథులను, అవార్డు గ్రహీతలను సరిగా గుర్తించకపోవడం, వారి పేర్లు తెలియక ఎంట్రీ వద్దే నిలిపివేయడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నట్లు సమాచారం. దీంతో పలువురు ప్రముఖులు అసౌకర్యానికి గురయ్యారు.

ఈ క్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ ఈవెంట్ నిర్వాహకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కార్యక్రమం మధ్యలోనే వెనుదిరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది వేడుక ప్రతిష్టను దెబ్బతీసే అంశంగా మారింది.

అదేవిధంగా ఆడిటోరియంలో కూడా సరైన ఏర్పాట్లు లేకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతిథులకు సరిపడా సీటింగ్ సదుపాయం లేకపోవడం, నిర్వహణలో స్పష్టత లేకపోవడం వంటి అంశాలపై నెటిజన్లు సోషల్మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.

మొత్తానికి వైభవంగా జరగాల్సిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుకలో సమన్వయ లోపాలు వెలుగులోకి రావడంతో నిర్వాహకులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
