మన భారత్, తలమడుగు:
మండలం ఖోడద్ గ్రామ అభివృద్ధికి గ్రామం నుంచి ఎదిగిన ఉద్యోగులు చేస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. గ్రామ ప్రజల విజ్ఞానాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన నూతన గ్రంథాలయం గ్రామానికి ఒక కొత్త దిశ చూపుతుందని ఆయన అన్నారు.
మంగళవారం తలమడుగు మండలం ఖోడద్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రంథాలయాన్ని పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసిన పుస్తకాలు, సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు, ముఖ్యంగా యువతకు విజ్ఞానం పెంపొందించేందుకు ఇలాంటి గ్రంథాలయాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.

కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామం నుంచి ఎదిగిన ఉద్యోగులు తమ స్వగ్రామ అభివృద్ధి కోసం ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆదర్శప్రాయమని కొనియాడారు. గ్రామ యువతకు విజ్ఞానం పెంపొందించేందుకు, పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి ఈ గ్రంథాలయం మంచి వేదికగా మారుతుందని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ 2047” బ్లూప్రింట్ను రూపొందించిందని కలెక్టర్ తెలిపారు. ఈ అభివృద్ధిలో గ్రామాలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని, ముఖ్యంగా యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకుని రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని సూచించారు.

సివిల్ సర్వీసెస్ వంటి కఠినమైన పోటీ పరీక్షలను సాధించాలంటే పట్టుదల, క్రమశిక్షణతో కూడిన ప్రణాళిక అవసరమని తన అనుభవాలను యువతతో పంచుకున్నారు. గ్రామంలోని ఉద్యోగులందరూ కలిసి యువతకు కెరీర్ గైడెన్స్, కౌన్సెలింగ్ అందించాలని సూచించారు. యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే కాకుండా స్టార్టప్లు, ఇన్నోవేషన్ రంగాల్లో కూడా ముందుకు రావాలని ఆకాంక్షించారు. గ్రామ అభివృద్ధికి జిల్లా పరిపాలన తరఫున తమ వంతు సహకారం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రియాంక లస్మ రెడ్డి, తహసీల్దార్ రాజ్ మోహన్, ఎంపీడీవో శంకర్, గ్రామ ఉద్యోగుల సంఘం సభ్యులు వెంకట్, నర్సింలు, చంద్రారెడ్డి, అనిల్ రెడ్డి, స్వామి, అశోక్, భోజా రెడ్డి, గౌతమ్, గోవర్ధన్, లలిత, స్వామి, గ్రామ యువత, గ్రామస్తులు, గ్రంథాలయ శాఖ అధికారులు, ఇతర శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
